Godavari Pushkaralu 2027 23rd July 2027 to 3rd Aug 2027

Godavari Pushkaralu 2027
23rd July 2027 to 3rd Aug 2027

 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. పూర్తి వివరాలివే

Godavari Pushkaralu 2027 Schedule: అఖండ గోదావరి పుష్కరాలు 2027కు సంబంధించి రాజమహేంద్రవరం లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని తూర్పు గోదావరి జిల్లాను యూనిట్​గా తీసుకొని సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, మునిసిపల్ కమీషనర్ కేతాన్ గార్గ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు, బత్తుల బలరామ కృష్ణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు-2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పుష్కరాల నిర్వహణపై తొలి సమావేశం జరిగింది. మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. రూ.904 కోట్లతో పనులు చేపట్టేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.మూడు విడతల్లో పనులు చేపట్టనున్నామన్నారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌. ఈ పనుల్లో భాగంగా.. రూ.400 కోట్లతో గోదావరి బండ్‌ రోడ్డును విస్తరించి అదనంగా 17 ఘాట్లను నిర్మించాల్సి ఉందన్నారు. మొత్తం 800 ఎకరాలను 74 పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు సేకరిస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి.. కేంద్ర భాగస్వామ్యంపై త్వరలో చర్చిస్తామన్నారు ఎంపీ పురందేశ్వరి. అఖండ గోదావరి పొడవునా పుణ్యస్నానాలు ఆచరించేలా అవసరమైతే మఠాధిపతులతో ప్రచారం చేయించాలి అన్నారు. కుంభమేళ, రామ ప్రతిష్ట తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని.. పుష్కర ఘాట్ల వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు, భక్తుల సంరక్షణకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడతామని మంత్రి దుర్గేశ్‌ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామంటున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విజన్ 2047 తరహాలోనే.. గోదావరి పుష్కరాలు 2047కు విజనరీతో ముందుకు వెళతామన్నారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకుని, సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.

గోదావరి పుష్కరాలకు దాదాపుగా రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ.. ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుగానే రంగంలోకి దిగారు. ప్రధానంగా చేపట్టాల్సిన పనుల్లో.. కార్పొరేషన్‌ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిషికేషన్‌, ఐకానిక్‌ టూరిజం సైట్‌ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు. మొత్తం మీద గోదావరి పుష్కరాలకు సంబంధించి ముందుగానే సమీక్షలు, పనులు మొదలుపెట్టనున్నారు.

2027 గోదారి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని కోర్ ప్లాన్ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులకు అనుగుణంగా బఫర్ జోన్ను ప్రతిపాదిస్తున్నామని..స్టే హోమ్ అనే ప్రతిపాదనతో రెండు రోజులు విడిది ఉండేలాగా ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. దీని కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజులపాటు శిక్షణ తరగతులను చేపట్టబోతున్నట్లు తెలిపారు.